Contact

Text

Monday, 24 March 2014

కులాంతర 'కక్ష'.. కూతురికి ఉరి!

05:26 - By Unknown 0


గుంటూరు జిల్లాలో పరువు హత్య
వేరే కులం అబ్బాయిని పెళ్లాడిందని తల్లిదండ్రుల ఘాతుకం
మళ్లీ పెళ్లి చేస్తామని నమ్మించి ఇంటికి..గొంతుకు చున్నీ బిగించి హత్య..
పరారీలో తల్లిదండ్రులు
గుంటూరు, మార్చి 23 : పసుపు, కుంకుమ, మెడలో మాంగల్యం, కాళ్లకు మెట్టెలు.. ప్రతి తల్లిదండ్రీ ప్రతి కుమార్తె గురించి ఆలోచించిదిదే. వాటన్నింటినీ ధరించి ఎదుట నిలిచిన తనయని గుండెలకు హత్తుకొని మనసారా ఆశీర్వదించాలని తపిస్తారు. ఆ ఘడియ కోసమే జీవిస్తున్నట్టు ఎదురుచూస్తుంటారు. కానీ, ఆ తల్లిదండ్రులు మాత్రం, కొత్తగా పెళ్లయిన కుమార్తెని కడతేర్చడం ఎలాగనే ఆలోచించారు. పెళ్లి చేసుకొని తొలిసారి ఇంట అడుగుపెట్టిన ఆమెకు, ఆ ఇంటినే బలిపీఠం చేశారు. ఆశీర్వదించాల్సిన చేతులతో గొంతు నులిమారు. కులం, గౌరవం, పరువు, ప్రతిష్టలకు.. కుమార్తె కలలు, అనుభూతులు, ఆమె కోరుకున్న జీవితం అడ్డం అయిపోయి.. అడ్డు తొలగించుకున్నారు. కాపురానికి పంపాల్సిన కన్నకూతురిని చేజేతులా కాటికి సాగనంపారు.
గుంటూరు నగరంలో ఆదివారం ఉదయం జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతుల కుమార్తె దీప్తి 2011 ప్రాంతంలో హైదరాబాద్ హెచ్‌సీఎల్ కంపెనీలో పనిచేసింది. ఆ సమయంలో అక్కడే పనిచేసిన కిరణ్‌కుమార్‌తో ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగిలో ఉంటున్న తల్లిదండ్రులకు కిరణ్ తమ ప్రేమ విషయం చెప్పారు. కుమారుడి ఇష్టానికి అనంతపల్లి నాగ సత్యనారాయణ, అరుశ్రీ మనస్ఫూర్తిగా అంగీకరించారు. అయితే.. అబ్బాయిది వేరే కులం కావడంతో దీప్తి తల్లిదండ్రులు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో కిరణ్‌కు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆయన అమెరికా వెళ్లారు. మరోవైపు.. తల్లిదంద్రులను ఒప్పించేందుకు దీప్తి అన్ని ప్రయత్నాలు చేసినా, ఫలితం లేకపోయింది. ఇంట్లో వేరే సంబంధాలు వెతుకుతుండటంతో దీప్తి తీవ్ర ఆందోళనకు గురైంది. కిరణ్‌కుమార్‌కు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. 'నన్ను పెళ్లి చేసుకోకుంటే చనిపోతా'నని హెచ్చరించింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కిరణ్ అమెరికా నుంచి వచ్చారు.
ఈ నెల 21న హైదరాబాద్ ఆర్య సమాజం ఆధ్వర్యంలో సితార హోటల్‌లో పెళ్లి జరిగింది. అబ్బాయి సోదరులు అశోక్‌కుమార్, కిషోర్ కుమార్ సహా కుటుంబ సభ్యులు, బంధువులంతా పెళ్లికి హాజరయ్యారు. వివాహం అనంతరం దీప్తి విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పింది. కుమార్తె ఇచ్చిన వివరాల ప్రకారం ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చారు. అప్పటికే సిద్ధం చేసుకొన్న పథకాన్ని అమలు చేశారు.
మొక్కు తీర్చుకోవాలని..
లోపల మరుగుతున్న మంటని హరిబాబు, సామ్రాజ్యం చిరునవ్వుల మాటున దాచేశారు. పైకి.. పెళ్లికి అంగీకరిస్తున్నట్లు నమ్మించారు. అయితే.. నాగులపాడులో తమ కులదైవానికి మొక్కు ఉందని అక్కడికి వెళ్లి అమ్మాయికి మొక్కు తీర్చుకున్నాక అందరినీ ఒప్పించి వివాహం చేస్తామని నమ్మబలికారు. శనివారం రాత్రి నూతన దంపతులు, అబ్బాయి తల్లిదండ్రులు, ఆయన బంధువులను తీసుకొని.. రెండు వాహనాల్లో గుంటూరు చేరుకొన్నారు. అక్కడి నుంచి తమ పథకాన్ని చకచకా అమలు చేయడం ప్రారంభించారు. గుంటూరు మార్కెట్ సెంటర్‌లో తమ కుమార్తెను కిందకు దించారు. "మేం ఇంటికి వెళతాం. దీప్తిని సిద్ధం చేసుకొని వస్తాం. అప్పటిదాకా మీరు హోటల్‌లో ఉండండి'' అని చెప్పి.. ఆటోలో బయల్దేరారు. కొంత అనుమానించిన కిరణ్ స్నేహితులు.. దీప్తిని తీసుకెళుతున్న ఆటోని మరో ఆటోలో అనుసరించారు. రాజేంద్రనగర్ రెండో లైనులో తాము అద్దెకు ఉంటున్న ఇంట్లోకి హరిబాబు, సామ్రాజ్యం..దీప్తిని తీసుకెళ్లారు.
ముగ్గురుగా లోపలకు వెళ్లిన వారు సుమారు 20 నిమిషాల తరువాత ఇద్దరే బయటకు వచ్చి.. హడావుడిగా ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయారు. వారి వాలకం చూసి అనుమానంతో ఇంటి వద్దకు కిరణ్ స్నేహితులు పరుగు పెట్టారు. దీప్తి చెప్పులు గుమ్మం వద్దే ఉండటం వారు గమనించారు. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తాళం పగలగొట్టి లోపలకి వెళ్లి చూడగా.. అప్పటికే దీప్తి ప్రాణాలు కోల్పోయింది. చున్నీతో మెడ బిగించి హత్య చేసినట్లు గుర్తించారు. మంచంపై విగతజీవిలా పడిఉన్న దీప్తి మెడకు చున్నీ బిగించి ఉంది. చున్నీ రెండు కొసలను మంచానికి అటూ ఇటూ కట్టి..దాన్ని దీప్తి గొంతుకు లాగి కట్టి హత్యచేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. కిరణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top